Tuesday 21 June 2022

 

 

సర్కారు బడికి డిమాండ్..



తెలంగాణలో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ పట్టుకుంది. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందంటే పాత తరగతిలో ఉండే విద్యార్ధులను ప్రమోట్ చేసి అడ్మిషన్స్‌ క్లోజ్ చేసే పరిస్థితి నుంచి మా స్కూల్‌లో సీట్లు లేవు అడ్మిషన్స్‌ అయిపోయాయి అని బోర్డులు పెట్టే వరకు వచ్చింది. సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ జిల్లాలో ఇదే తరహాలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు కుస్తీ పడుతున్న దృశ్యాలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మా పిల్లలకు పాఠశాలలో ప్రవేశం కల్పించండి అంటు ఓ స్టూడెంట్ పేరెంట్స్.. లేదు మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఇంకో విద్యార్ది తల్లిదండ్రులు పోటీ పడ్డారు. ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది విద్యార్ధుల తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రాదేయపడ్డారు. ఇంతగా బ్రతిమిలాడుతున్నారంటే అది కచ్చితంగా ఫేమస్‌ కార్పొరేట్ స్కూల్‌ అయి ఉండవచ్చని అందరూ భావిస్తారు. కాని కాదు ప్రభుత్వ పాఠశాల. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్. ఈ స్కూల్‌లో చేర్పించడానికే తమ పిల్లల్ని తీసుకొని అడ్మిషన్ల కోసం వచ్చిన పేరెంట్స్‌తో స్కూల్‌ ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. సాధారణంగా సర్కారు బళ్లు, ఆసుపత్రులు ప్రజాదరణకు నోచుకోవు. సర్కారు బడిలో సరిగ్గా చదువు చెప్పరనే నానుడి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండరు, మంచి మందులివ్వరనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాని ఇందిరానగర్‌లోని ఈ జడ్పీ హైస్కూల్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. ఈ స్కూల్‌లో సుమారు 1200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 24 సెక్షన్లకు 14 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు, 40మంది నిబంధనల ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే ఈస్కూల్‌లో చదువుకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టే స్టూడెంట్స్‌ సంఖ్య పెరుగుతోందని చెప్పకనే చెప్పొచ్చు. గతేడాది విద్యార్ధుల సంఖ్యను పక్కనపెడితే ఈసారి కొత్తగా 6వ తరగతిలో చేరేందుకు మరో 300 మంది రెడీగా ఉన్నారు. ఇప్పటికే 7, 8, 9, 10వ తరగతుల్లో అడ్మిషన్లు లేవని ఫ్లెక్సీ ఏర్పాటు చేయారు స్కూల్‌ ఉపాధ్యాయులు. స్కూల్‌లో విద్యాప్రమాణాలు మెరుగ్గా ఉండటంతో పెద్ద సంఖ్యలో వస్తున్న తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 6వ తరగతిలో సెక్షన్ల వారీగా 160 సీట్లు ఖాళీలు ఉండగా.. క్లస్టర్ పరిధిలోని 12 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మిగిలిన సీట్లను ఇతరులతో భర్తీ చేస్తామన్నారు. స్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత వల్లే అడ్మిషన్లు ప్రక్రియ జాప్యం జరుగుతోందన్నారు హెడ్‌మాస్టర్. ప్రభుత్వం తగినంత మందిని సమకూరిస్తే మరిన్ని సీట్లు సర్దుబాటు చేస్తామన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారం, పది రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని సమాధానం ఇచ్చారు. అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్‌ పత్రాలను పేరెంట్స్‌ నుంచి తీసుకున్నారు. సిద్దిపేటలోని ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి చూస్తుంటే గతంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ స్కూల్‌లో కూడా ఇంతే డిమాండ్ ఉండేది. స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండటంతో అక్కడి విద్యార్ధుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్‌ కంటే పోతిరెడ్డిపల్లి హైస్కుల్‌లో చదివించడానికే ఎక్కువ మొగ్గు చూపేవారు. స్కూల్‌లో సీటు కోసం రిఫరెన్స్ లెటర్స్ తెచ్చినప్పటికి అడ్మిషన్లు దొరికేవి కాదు. ప్రస్తుతం సిద్దిపేట జడ్పీ హైస్కూల్‌లో అదే పరిస్థితి తలెత్తిందంటున్నారు స్థానికులు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లోని జడ్పీ హైస్కూల్‌లో కూడా అడ్మిషన్లు లేవని స్కూల్‌ ముందే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది.

1 comment:

  1. నిజమే, ఇంకా వసతులు సరిగా చేస్తే మల్లి సర్కారు బడికి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...