తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ను
పెంచుతున్న కేసీఆర్!!?
వినటానికి
విడ్డురంగా ఉన్న ఇది నిజమే అనిపిస్తుంది, ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాటలు జాగర్తగా
గమనించినట్టయితే..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ
ట్రాప్లో పడి ఏదేదో మాట్లాడుతున్నారా? అంటే ఔననే సమాధానం
వస్తోంది. బీజేపీతో యుద్ధం అంటూ అనవసర బాధ్యతను తనకు తానుగా
నెత్తికెత్తుకున్నారనే భావన చాలా మందిలో వుంది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ను
కేసీఆరే పెంచుతున్నారనే వాదనలో నిజం ఉందనిపిస్తోంది. కాంగ్రెస్ను ఖతం చేసి,
అందుకు తగ్గ మూల్యాన్ని కేసీఆర్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి
ఏర్పడింది.
జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ గత
కొన్ని నెలలుగా కొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడును
అడ్డుకోవడమే పెద్ద సవాల్గా మారిన తరుణంలో, జాతీయస్థాయిలో ఆ పార్టీని ఎదుర్కోవడంపై
సాధ్యాసాధ్యాలను కేసీఆర్ ఆలోచించకపోవడం వడ్డూరంగా ఉంది. నిజామాబాద్ బహిరంగ సభలో
కేసీఆర్ మాటలు వింటే... ఈయనకు ఏమైంది? అనే అనుమానం కలుగుతుంది.
‘ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే
రానుంది. కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర
ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం
ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్
ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం’అని కేసీఆర్
వ్యాఖ్యానించారు.
‘సంతలో పశువులను కొన్నట్లు
ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకే మోదీ
ప్రాధాన్యమిస్తున్నారు’అని కేసీఆర్ మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి
వెళ్లాలనే కోరికను ఎవరూ కాదనలేరు. అయితే అందుకు తగ్గ రాజకీయ పరిస్థితులు తనకు
ఎంత వరకు అనుకూలంగా ఉన్నాయో కేసీఆర్ ఆలోచించారా? తెలుగు
రాష్ట్రాల్లోనే కేసీఆర్ను ఎవరూ నమ్మలేని పరిస్థితి. రాజకీయ అవసరాలకు తగ్గట్టు
కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటారనే పేరు ఆయనకు ఉంది.
బీజేపీ ముక్త్ భారత్ సాధన సంగతేమో
గానీ, టీఆర్ఎస్
ముక్త తెలంగాణ అంటూ వస్తున్న మోదీ, అమిత్షాలను ఎలా
ఎదుర్కోవాలో కేసీఆర్ ఆలోచిస్తే మంచిది. మరోసారి తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించేలా
నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు
ముంచుకొస్తున్నాయి. అంతకంటే ముందు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బీజేపీ పెద్ద సవాలే
విసిరింది.
ఒక్క మునుగోడులో గెలుపొందేందుకే
రెండు ఊళ్లకు కలిపి ఒక ఎమ్మెల్యేను నియమించిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో
ఇది సాధ్యమా? జాతీయ
రాజకీయాల్లోకి వెళ్తానని పదేపదే కేసీఆర్ చెప్పడం వెనుక వ్యూహం ఏంటో గానీ,
అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఉట్టికి ఎగరలేనమ్మా,
స్వర్గానికి ఎగురుతా అన్నట్టుగా కేసీఆర్ రాజకీయ పంథా ఉందనే విమర్శలున్నాయి.
కేసీఆర్ భవిష్యత్ ఆయన చేతల్లోనే ఉంది.