Tuesday 21 June 2022

 

కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసేందుకు ప్రణాళికా రచించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సారూ వర్థంతి ఈ రోజు. 

తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియశీల పాత్ర పోషించినవారిలో ప్రొఫెసర్ జయశంకర్ ముందు వరసలో ఉంటారు. మలిదశ ఉద్యమానికి తన మేధస్సును జోడించి రాష్ట్ర సాధనకు కావాల్సిన కార్యాచరణను రూపొందించారాయన. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ట్రానికి రోడ్డు మ్యాప్ వేశారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్యార్థులు, ప్రజలు, ఉద్యమ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చేదాకా అలుపెరుగని పోరాటం చేశారు. ఇలా కొన్ని కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసేందుకు ప్రణాళికా రచించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి ఈ రోజు. ఉమ్మడి వరంగల్​ జిల్లా అక్కంపేటలో మహాలక్ష్మి, లక్షీకాంతరావు దంపతులకు 1934 ఆగస్టు 6న జయశంకర్​ పుట్టారు. హనుమకొండ, వరంగల్ లో ప్రాథమిక, ఉన్నత విద్య చదివారు. బెనారస్ యూనివర్సిటీ, అలీగఢ్​​ యూనివర్సిటీ నుంచి వేరు వేరుగా పీజీ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ​ చేశారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ఆయనకు మంచి పట్టుంది. ఆరో తరగతి చదివేటప్పుడే స్కూల్​లో నిజాంను పొగుడుతూ పాడిన పాటను బహిష్కరించి వందేమాతరంఅని నినదించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చిన్నతనం నుంచే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.మా తెలంగాణ మాగ్గావాలి. స్వయం పాలనలో శాసిస్తాం. కానీ ఇతరుల పాలనలో ప్రస్తుతం యాచిస్తున్నాంఅని బాధపడే వారు. 1952లో ముల్కి విధానాలను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి స్టూడెంట్​ లీడర్​ గా నడుంబిగించారు. లెక్చరర్​ గా సీకేఎం కాలేజీలో చేరిన ఆయన... తన రచనలు, బోధనల ద్వారా తెలంగాణ ఏర్పడితే వచ్చే ప్రయోజనాల గురించి స్టూడెంట్లకు నూరిపోసి వారిలో చైతన్య దీపం వెలిగించారు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్నారు. 1954లోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఫజిల్ ఆలీ కమిషన్ కు ఓ నివేదిక సమర్పించారు. 1969లో ఆర్.సత్యనారాయణ, శ్రీధరస్వామి మొదలైన పది మంది మేధావులతో ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ సాధనకు వ్యూహాలు రచింపచేశారు. ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ జనసభను అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణ ఆవశ్యకత గురించి ఎన్నో రచనలు చేశారు. ఎన్నో డాక్యుమెంట్లను రూపొందించారు. తెలంగాణ వచ్చిన వెంటనే చెరువులను పునరుద్ధరించి గ్రామీణ వ్యవస్థను సస్యశ్యామలం చేయాలని తహతహలాడారు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి పరుగులు పెట్టించారు.

1975 నుంచి 1979 వరకూ సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్ గా, 1979 నుంచి 1981వరకూ కాకతీయ వర్సిటీ రిజిస్ట్రార్ గా, 1982 నుంచి 1991వరకూ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్ గా, 1991 నుంచి 1994 వరకూ కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ గా పనిచేశారు. 1999-–2000 మధ్య అమెరికాలో పర్యటించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమం గురించి అవగాహన కల్పించారు. అప్పట్లోనే తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం(టీడీఎఫ్)ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటులో జయశంకర్​ ను కేసీఆర్ గురువుగా భావించారు. 2009లో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్​ చేసిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. కేసీఆర్​ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. బతికున్నంత కాలం తెలంగాణ ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేసి, చివరి వరకూ బ్రహ్మచారిగా‌‌ జీవనాన్ని కొనసాగించి, తాను కలలు కన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే 2011 జూన్ 21న కనుమూశారు. జయశంకర్ సార్ పేరు మీద ఓ జిల్లాను, ఓ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టినప్పటికీ... ఆయన జయంతి, వర్థంతులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలేదు. పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాలు తీరేలా ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణను సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు

1 comment:

  1. ఇవాళ అధికారం అనుభవించే వాల్ళతంతా అయన పాదాలకు నమస్కారం చేయాలి, kaani ఆయన జయంతి, వర్థంతులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలేదు

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...