బలవంతంగా పదవీ విరమణ చేయిస్తున్నారా?
అప్పుడు అద్వానీ.. ఇప్పుడు వెంకయ్యనాయుడు
కేవలం రెండు సీట్లున్న భారతీయ జనతాపార్టీని ఈరోజు ఈస్థాయికి తేవడంలో అద్వానీ పాత్ర మరవలేనిది. ఆయన లేకుండా, ఆయన రథయాత్ర లేకుండా ఉంటే బీజేపీ ఎక్కడ ఉండేదో ఆ పార్టీ నేతలకే తెలియాలి. దశాబ్దాల నుంచి బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను నమ్ముకున్నవారందరికీ నరేంద్రమోడీ, అమిత్ షా వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం జరుగుతోంది. అందుకు ఉదాహరణ అప్పుడు అద్వానీ కాగా, ఇప్పుడు వెంకయ్యనాయుడు.!!
లాల్కృష్ణ అద్వానీ ప్రధానమంత్రి కావాలనుకున్నారు. కానీ ఉప ప్రధానమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో అద్వానీ పేరే దేశవ్యాప్తంగా వినపడింది. కానీ రాజకీయంగా తాను భిక్ష పెట్టిన నరేంద్రమోడీకి మాత్రం తన గురువులో 'రాష్ట్రపతి' కనపడలేదు. ఎక్కడో ఉన్న రామ్నాథ్ కోవింద్ను తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు. దీంతో అద్వానీ రాజకీయాల నుంచి అంతర్థానమయ్యారు. శిష్యుడి చేతిలో ఎదురైన అవమానం ఆయన్ను జీవితాంతం బాధపెడుతూనే ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వెంకయ్యనాయుడిని హఠాత్తుగా ఉప రాష్ట్రపతిని చేశారు. దీంతో ఆయన గొంతు మూగబోయింది.
ఉపరాష్ట్రపతి పదవి తర్వాత రాష్ట్రపతి పదవి ఇస్తారని వెంకయ్య ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగానే తన పదవీ బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆశలు అడియాశలయ్యాయి. వెంకయ్యనాయుడిలో కూడా నరేంద్రమోడీ, అమిత్ షాకు 'రాష్ట్రపతి' కనపడలేదు. ఒడిశాలో ఉన్న ద్రౌపది ముర్ముకు పదవిని కట్టబెట్టారు. ఎన్నిక జరగాల్సి ఉంది. అద్వానీ తరహాలోనే వెంకయ్యనాయుడిని కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి బలవంతంగా పదవీ విరమణ చేయించబోతున్నట్లు స్పష్టమవుతోంది. మంచి వాగ్ధాటి, అన్ని పార్టీల నేతలతో సన్నిహిత పరిచయాలనున్నవారిని ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలికానీ తమ రాజకీయాలకు అడ్డు వస్తారనే ఆలోచనా రీతితో వారిని బలవంతంగా తప్పించడమనేది ఏ తరహా రాజకీయమో తమకు కూడా తెలియడంలేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్రపతి పదవి అంటే భారత ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది. అటువంటి పదవిలో రాజకీయ ఉద్ధండులను నియమించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. వర్గ పరంగా రామ్నాథ్ కొవింద్, ద్రౌపది ముర్ములను ఎంపిక చేయడంద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేశామని అనుకుంటున్నారుకానీ దశాబ్దాల తరబడి పార్టీ ఎదుగలకు కారకులైనవారికి, కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్నవారికి మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందనేది మన కళ్లెదుట కనపడుతున్న వాస్తవం.!!
అందునా తెలుగు వారు కూడా కదా, కానీ ప్రసిడెంట్ చేసి ఉండాల్సింది, ఇప్పుడు అయన ఎం చేయగలడు మల్లి ఆక్టివ్ రాజకోయలకు రాలేదు
ReplyDelete