Monday 20 June 2022

 అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్‌


భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం 'అగ్నిపథ్' పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారంనాడు ప్రకటించారు.

ఈ పథకంలో భాగంగా యువకులకు నాలుగు సంవత్సరాలపాటు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు. ఆ తర్వాత వారికి సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు. ఈ పథకంలో ఉద్యోగం పొందిన వారిని అగ్నివీర్ అని పిలుస్తారు.

యువకులలో చాలామందికి ఆర్మీలో ఉద్యోగం పొందడం ఒక కల. కానీ, గత కొన్నేళ్లుగా సైన్యంలో నియామకాలు జరగడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగ సమయంలో ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు అగ్నివీర్ లకు ఇచ్చే ప్యాకేజీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

అగ్నిపథ్ పథకాన్ని సైన్యంలో ఆధునిక, రూపాంతర దశగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

కొత్తగా నియమించే అగ్నివీర్ ల వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉంటుందని, వారి జీతం నెలకు 30-40 వేల రూపాయల మధ్య ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

రిక్రూట్ అయిన యువతలో 25 శాతం మంది ఇండియన్ ఆర్మీలో కొనసాగుతారు. మిగిలిన వారు ఉద్యోగాన్ని వదిలేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ప్రభుత్వం 46 వేలమంది అగ్నివీర్ లను నియమించనుంది.

యువకులకు సైన్యంలో సేవలందించే అవకాశం కల్పిస్తామని, దేశ భద్రతను పటిష్టం చేసేందుకు, యువతకు సైనిక సేవలో అవకాశం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

ఈ పథకం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సర్వీసులో ఉన్న నైపుణ్యాలు, అనుభవంతో వారికి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయని ఆయన అన్నారు.

అగ్నిపథ్ పథకం గురించి క్లుప్తంగా మీరు తెలుసుకోవాల్సింది ఇదీ..

17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. పదో తరగతి లేదా ఇంటర్ పాసవ్వాలి.

అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.

మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం. మూడో ఏడాదిలో ప్రతి నెలా 36500 రూపాయల జీతం. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం.

జీతంలో నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని తీసుకుని కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. అలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.

సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.

నాలుగేళ్ల తర్వాత పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. వీళ్లు సైన్యంలో 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

అగ్నిపథ్ తో భారత సైన్యం రూపురేఖలు మారిపోతాయా?

ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం, యువతలో జాతీయ భావాన్ని బలోపేతం చేయడం, భారత సైన్యాన్ని యువసైన్యంగా మార్చడం, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే యువత ఆకాంక్షను నెరవేర్చడం ఈ పథకం లక్ష్యం.

భారత సైన్యపు సంప్రదాయ స్వభావాన్ని దెబ్బతీయడంతోపాటు, సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేసే పొరపాటు నిర్ణయంగా ఈ పథకాన్ని కొందరు విమర్శకులు తప్పుబడుతున్నారు.

"డబ్బును ఆదా చేయడం మంచిదే కానీ రక్షణ దళాలను పణంగా పెట్టి చేయకూడదు" అని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు. దీన్ని ఆయన మూర్ఖపు చర్యగా పేర్కొన్నారు.

భారత సైన్యం పై జీతం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చాలామంది భావిస్తున్నారు.

"మేము ఏదో చేశామని, నిర్ణయాలు తీసుకునే పార్టీగా నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది'' అని రిటైర్డ్ మేజర్ జనరల్ షెయోనన్ సింగ్ అన్నారు.

అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా భారత సైన్యాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలనే అంశంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది.

భారత సైన్యంలో 68 శాతం పరికరాలు చాలా పాతవి, 24 శాతం పరికరాలు మాత్రమే నేటి కాలానికి చెందినవి. 8 శాతం అత్యాధునిక విభాగంలో ఉన్నాయి. దీనికి కారణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 2021-22 సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌లో 54 శాతం జీతాలు, పెన్షన్‌ల కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఒక డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో రక్షణ పెన్షన్‌ పై వ్యయం 12 శాతం పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో సగటు పెరుగుదల 8.4 శాతమే ఉంది. రక్షణ బడ్జెట్‌లో పెన్షన్ 26 శాతానికి పెరిగి మళ్లీ 24శాతానికి తగ్గింది.

దేశంలో ఉద్యోగాలు రాకపోవడం పెద్ద సమస్యగా మారిన తరుణంలో ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

''భారతదేశంలో నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్య. ప్రజలకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి రేటు అంత వేగంగా పెరగడం లేదు'' అని భారత ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలించే సీఎంఐఈ సంస్థకు చెందిన మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు.

''కోవిడ్ కాలంలో భారతదేశంలో నిరుద్యోగం రేటు 25 శాతానికి చేరుకుంది. ఇప్పుడు ఈ రేటు 7 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో యువతలో (15-29 ఏళ్లు) నిరుద్యోగిత రేటు చాలా కాలంగా 20 శాతానికి పైగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాదిన్నర కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు'' అని మహేశ్ వ్యాస్ అన్నారు.

మంచి పథకమా, చెడ్డ పథకమా?

''భారత సైన్యంలో నాలుగేళ్ల పాటు పనిచేయడం అంటే చాలా తక్కువ సమయం. నిజంగా ఇది మంచి ఆలోచన అయితే, దీన్ని దశలవారీగా అమలు చేయాలి. ఇంత తక్కువ సమయంలో ఒక యువకుడు సైన్యంతో ఎలా కనెక్ట్ అవుతాడన్న ఆందోళన కూడా ఉంది'' అని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు.

''నాలుగేళ్లలో ఆర్నెల్లు ట్రైనింగ్ లోనే ఉండాలి. ఆ తర్వాత పదాతి దళం, సిగ్నల్స్ వంటి విభాగాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటికోసం వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుధాలను ఉపయోగించడానికి వారికి సరైన జ్ఞానం, అవగాహన ఉండాలి'' అని సింగ్ అభిప్రాయపడ్డారు.

''అగ్నిపథ్ పథకంలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ కాలేడు. గ్రౌండ్స్‌మెన్‌ అవుతాడు.. మెకానిక్‌ అవుతాడు.. వర్క్‌షాప్‌కి వెళ్తాడు. కేవలం నాలుగేళ్లలో ఏం నేర్చుకుంటాడు?

అనుభవం ఉన్న సైనికుడితో కొత్తగా నియమితుడైన సైనికుడు యుద్ధానికి వెళితే, సీనియర్ మరణించినప్పుడు కేవలం నాలుగేళ్ల ట్రైనింగ్ తో ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయగలడా?'' అని సింగ్ ప్రశ్నించారు.

భారత దేశానికి యుద్ధం కంటే తిరుగుబాటు లేదా దేశద్రోహం వల్ల ముప్పు ఉందని, దీనిని ఎదుర్కోవడానికి అనుభవజ్ఞుడైన, పరిణతి చెందిన మనసున్న వ్యక్తులు అవసరమని సింగ్ అన్నారు.

సైన్యంలో శిక్షణ పొంది పని చేసి వచ్చిన 21 ఏళ్ల నిరుద్యోగ యువకుడు తన శిక్షణను దుర్వినియోగం చేసి, సమాజానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని 'అగ్నిపథ్' పథకాన్ని విమర్శించే కొందరు చెబుతున్నారు.

టెన్త్ లేదా ఇంటర్ వరకు మాత్రమే చదవిన 21 ఏళ్ల యువత మళ్లీ ఎలా ఉపాధి సంపాదించుకోగలదని రిటైర్డ్ మేజర్ జనరల్ షెయోనన్ సింగ్ ప్రశ్నిస్తున్నారు.

"పోలీసు రిక్రూట్‌మెంట్‌ కు బీఏ పాసయిన యువకులు వస్తున్నారు. దీనివల్ల అగ్నివీర్ లు వెనకబడాల్సి వస్తుంది. చదువు ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రమోషన్‌ అవకాశాలు దెబ్బతింటాయి" అని ఆయన అన్నారు.

యువతకు 11 ఏళ్ల పాటు సైన్యంలో పని చేసే అవకాశం ఇవ్వాలని, ఎనిమిదేళ్ల తర్వాత వారు సగం పెన్షన్‌తో వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించాలని షెయోనన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

21 సంవత్సరాల గ్రాడ్యుయేట్ కు, అగ్నివీర్ గా పని చేసి వచ్చిన యువకుడికి మధ్య తేడా చాలా ఉంటుందని, సైన్యంలో పని చేసిన వచ్చిన యువకుడు ప్రత్యేకంగా ఉంటాడని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.బి. అస్థానా అన్నారు.

ఇదిలా ఉండగా.. ఆరాహ్‌ దగ్గర రాళ్లు రువ్విన నిరసనలకారుల మీద, ప్రతిగా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. రైలు పట్టాల మధ్య ఫర్నీచర్‌కు నిప్పు పెట్టి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. 

జెహానాబాద్‌లో విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. నిరసనకాలరును చెదరగొట్టేందుకు.. తుపాకులను గురిపెట్టి భయపెట్టారు. నవాడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.    

వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన అగ్నిపథ్‌ పథకానికి.. మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్‌ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త విధానంపై సైన్య నిపుణులు సహా అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల పదవీకాలం, ర్యాంకుల్లో.. పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, రిస్క్‌లకు వారిని దూరంగా ఉంచుతుందని విమర్శకులు విమర్శిస్తున్నారు

1 comment:

  1. అగ్నిపథ్ పథకంలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ కాలేడు. గ్రౌండ్స్‌మెన్‌ అవుతాడు.. మెకానిక్‌ అవుతాడు.. వర్క్‌షాప్‌కి వెళ్తాడు. కేవలం నాలుగేళ్లలో ఏం నేర్చుకుంటాడు?

    అనుభవం ఉన్న సైనికుడితో కొత్తగా నియమితుడైన సైనికుడు యుద్ధానికి వెళితే, సీనియర్ మరణించినప్పుడు కేవలం నాలుగేళ్ల ట్రైనింగ్ తో ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయగలడా?''

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...