Wednesday 29 June 2022

 

యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న మోదీ..





హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ రుచులు సందడి చేయనున్నారు. ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులకు యాదమ్మ అనే మహిళ ప్రత్యేకంగా వంట చేయనుంది.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముస్తాబవుతోంది. జులై 2, 3 తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. దీంతో ఆ సమావేశాలను తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీరందరికీ తెలంగాణ సంప్రదాయ రుచులు రుచి చూపించాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ స్పెషల్ వంటకాలను ఏరికోరి మెనూలో చేర్చారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి తెలంగాణ రుచులు చూపించాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను అనే మహిళను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అసలు ఎవరీ యాదమ్మ...గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ మహిళకు ఏకంగా దేశ ప్రధానికే వంటచేసి పెట్టే అవకాశం ఎలా వచ్చింది?.. దీని వెనుక పెద్ద కథే ఉంది.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో మెట్టినింటికి చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. దీంతో 29ఏళ్లుగా వంట వృత్తే ఆమెకు జీవనాధారమైంది. యాదమ్మ చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఎవరైనా ఆహా అనకుండా ఉండలేరు. ఒకేసారి 10వేల మందికి కూడా వండివార్చే నేర్పరితనం ఆమె సొంతం. దీంతో పెద్ద సభలు, భారీ కార్యక్రమాలకు చాలామంది ఆమెనే పిలుస్తుంటారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పాల్గొనే కార్యక్రమాల్లోనూ యాదమ్మే వంటలు చేస్తుంటుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా యాదమ్మ వంటలంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మతో వంటలు చేయించాలని నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపు అందిన వెంటనే యాదమ్మ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌కి వస్తున్న మోదీ సారుకి నువ్వే వంటలు చేయాలని చెప్పడంతో యాదమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మోదీ సారు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు కావాలని అడగడంతో సంజయ్ సారు నన్ను హైదరాబాద్‌కి పిలిపించారని యాదమ్మ చెబుతోంది. ఆయన పూర్తిగా శాఖాహారి కావడంతో పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటకాలతో పాటు గుత్తి వంకాయ, పచ్చిపులుసు, గంగవాయిలి కూర పప్పు, సాంబారు మొదలైన వంటకాలు వండేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు పప్పు గారెలు, సకినాలు, అరిసెలు, పాయసం, సర్వపిండి, భక్షాలు, పాయసం వంటివి కూడా తయారుచేయనున్నట్లు చెబుతోంది. మోదీ సారు తన వంట తింటే అంతకంటే భాగ్యం ఏముంటుందని యాదమ్మ ఆనందంలో మునిగితేలుతోంది.

2 comments:

  1. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటకాలతో పాటు గుత్తి వంకాయ, పచ్చిపులుసు, గంగవాయిలి కూర పప్పు, సాంబారు మొదలైన వంటకాలు వండేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు పప్పు గారెలు, సకినాలు, అరిసెలు, పాయసం, సర్వపిండి, భక్షాలు, పాయసం వంటివి కూడా తయారుచేయనున్నట్లు చెబుతోంది.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...