Saturday, 9 July 2022


తొలి ఏకాదశి ఉత్సవాలు...కామధేనువు సేవా సమితి సభ్యులు




ఆషాఢ శుద్ధ ఏకాదశిగానే తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.


ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. 


తొలి ఏకాదశి ప్రాశస్త్యం

ఆషాఢమాస శుక్ల పక్షంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.


తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.


తొలి ఏకాదశి జరుపుకొను విధానం,నియమాలు…ఉపవాస ఫలితాలు

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా లేచి శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.


ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.


ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.


మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.


ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.


తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే.. ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. 

స్థానిక సనత్ నగర్ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు...

🙏జై శ్రీమన్నారాయణ


*హనుమాన్ దేవస్థానం  దేవాదాయ ధర్మాదాయ శాఖ సనత్ నగర్*


 శ్రీ పద్మావతి సమేత

కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు 10/7/22 తేదీ

ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ

 ఉదయం 5:30 గంటలకు   ఆదివారం రోజున ఆషాడ శుద్ధ ఏకాదశి అనగా *తొలి ఏకాదశి* పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి  స్వామివారికి అష్టోత్తర

శత  క్షీరాభిషేకము(108 లీటర్ల పాలు తో)

 పంచామృత  సుగంధ ద్రవ్య అభిషేకము.

 పుష్పాలంకరణ ఐదు రకాల ప్రసాదలతో స్వామివారికి నైవేద్య సేవ సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ తో  

*లక్ష తులసి*

 కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి లక్ష తులసి అర్చనకాబట్టి 

అందరూ ఏకాదశి రోజున స్వామివారి దేవాలయంలో జరిగినటువంటి విశేష ఉత్సవాలలో పాల్గొని సేవించి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.


 కామధేనువు సేవా సమితి సబ్యులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు...

Friday, 8 July 2022

 

ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసిన నాయకుడు-- దారుణ హత్య


పాన్‌ మాజీ ప్రధాని, భారత్ ఆత్మీయ మిత్రుడు షింజో అబె ఇకలేరు. ఎన్నికల ప్రచారంలో దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడి కాల్పుల్లో గాయపడిన షింజో అబె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎల్‌డీపీ వర్గాలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ వార్త తెలియగానే ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతోంది. ఒక దేశ మాజీ ప్రధాని, దూరదృష్టి గల నేత, ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు, జనం మనసెరిగిన నేత ఇలా దారుణంగా హత్యకు గురవడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. షింజో అబె మృతిపై వివిధ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు్న్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారుజపాన్‌ పార్లమెంట్‌ ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిమిత్తం షింజో అబె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం (జులై 8) ఉదయం నరా నగరంలోని ఓ కూడలి వద్ద లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన వేదికపైనే కుప్పకూలారు. దుండగుడు నాటు తుపాకీతో ఆయన వెనుక వైపు నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు సార్లు కాల్పలు జరపడంతో షింజో అబె తీవ్రంగా గాయపడ్డారు

 

2022 ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం మన దేశ జాతీయ గీతం




మన దేశ జాతీయ గీతం.'' జన గణ మన అధినాయక.''ను యునెస్కో ' ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం 2022'గా ప్రకటించింది. భారతీయులమైన మనం ఇందుకు గర్వించాల్సి ఉంది. విశ్వ కవి రవీంద్ర నాథ్ ఠాగుర్ రాసిన ఆ గీతంలో ప్రతి పదానికి అర్థం. జన= ప్రజలు, గణ=సమూహం, మన:=మనస్సు, అధినాయక= నాయకుడు, జయహే= విజయం, భారత=ఇండియా, భాగ్య= సంపద, విధాత= ఇచ్చేది, పంజాబ= పంజాబ్, సింధు=సింధు, గుజరాత=గుజరాత్, మరాఠ= మరాఠి(మహారాష్ట్ర), ద్రవిడ=దక్షిణం, ఉత్కల=ఒరిస్సా, బంగా=బెంగాల్, వింధ్య= వింధ్యా పర్వతాలు, హిమాచల్=హిమాలయాలు, యమున=యమునా నది, గంగ=గంగా నది, ఉచ్ఛల=కదిలే, జలధి=సాగరం, తరంగ= తరంగాలు, తవ=మీ, శుభ=శుభకరం, నామే=పేరు, జాగే=జాగరుకం, తవ=మీ, శుభ=శుభకరం, ఆశిష=దీవెనలు, మాగే=కోరుతున్నా, గాహే=పాడు, తవ=నీ, జయ=విజయం, గాథ=పాట, జన=జనులు, గణ=సమూహం, మంగళ=మంగళకరం, దాయక=ఇచ్చే, జయహే=విజయం కలుగుగాక, భారత=ఇండియా, భాగ్య= భాగ్యం, విధాత=ఇచ్చేది. జయహే, జయ హే, జయ హే, జయజయజయ జయహే= విజయం,విజయం,విజయం జయజయజయ జయం ఎల్లప్పటికీ.

Thursday, 7 July 2022

 

కాకతీయుల వారసుడొచ్చారా?




 

ఓరుగల్లు ప్రధాన కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనలో వారి రాజ్యం నేటి తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వరకు విస్తరించింది.

వ్యవసాయ, సాంస్కృతిక, విదేశీ వాణిజ్యపరంగా గొప్పగా ఎదిగిన సువిశాల కాకతీయ సామ్రాజ్యం ఎలా పతనమైంది? కాకతీయ వంశంలో చివరి రాజు రెండో ప్రతాపరుద్రుని మరణం వెనుక మిస్టరీ, ఆ తర్వాతి కాలంలో కాకతీయ వంశస్తులు ఏమయ్యారు అన్నదానిపై చరిత్ర పరిశోధకుల్లో 700 ఏళ్ల తర్వాత కూడా ఏకాభిప్రాయం లేదు.

రాణి రుద్రమ దేవికి కొడుకులు లేకపోవడం తో తన కూతురు 'ముమ్మడమ్మ' కొడుకు ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని పట్టాభిషేకం చేసింది.

కాకతీయ పాలకుల్లో చివరి రాజు (రెండవ )ప్రతాపరుద్రుడు. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రతాపరుద్రుని చివరి కాలంలో కాకతీయ సామ్రాజ్యం వరుసగా ముస్లిం రాజుల దాడులకు లోనయింది.

వాటిలో ప్రధానమైనవి ఖిల్జీ, తుగ్లక్ వంశాలకు చెందిన దిల్లీ సుల్తానులు జరిపినవి. క్రీ.శ. 1323లో 'ఘియాజుద్దీన్ తుగ్లక్' సైనిక అధికారి (కొడుకు) 'ఉలుగ్ ఖాన్' నేతృత్వంలో జరిగిన దాడిలో కాకతీయ సామ్రాజ్యం పతనం అయింది. ఇక్కడి వరకు చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం కనిపిస్తుంది.

అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై పరిశోదకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండవ ప్రతాపరుద్రుని మరణంపై ఏకాభిప్రాయం లేదు.

రెండో ప్రతాపరుద్రున్ని బందీ పట్టుకుని దిల్లీకి తరలిస్తున్న క్రమంలో ఆయన నర్మద నదిలో ప్రాణత్యాగం చేశారన్న వాదన ఒకటి ఉంది. అయితే ఆయన వారి చెర నుండి తప్పించుకున్నడన్నది మరో వాదన.

ఆ తర్వాత చాలాకాలం ప్రతాపరుద్రుడు బతికే ఉన్నాడని ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద చనిపోయాడన్నది మరో కథ. తన తమ్ముడు అన్నమదేవుడి సహాయంతో బస్తర్ కేంద్రంగా ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్య స్థాపన చేశాడన్నది ప్రచారంలో ఉన్న మరో కథనం.

.

''వీరభద్రారెడ్డి భార్య రెడ్డిరాణి 'అనితల్లి దేవి' వేయించిన 'కలువ చెరువు' దానశాసనం ప్రకారం 'సోమోద్బవ నది' లోదూకి ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రతాపరుద్రుని మరణం తర్వాత సుమారు వంద సంవత్సరాల కాలానికి ఈ శాసనం వేయించారు. ''17 వ శతాబ్ధంలో ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్ర చరిత్ర', ఇతర ఐతిహాసాల ప్రకారం బందీగా దిల్లీ తీసుకెళ్తున్న ప్రతాపరుద్రుడిని కాకతీయ సేనానాయకుల్లో కొందరు పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా నుంచి తప్పించారు.

ఆ తర్వాత కొంత కాలానికి ఆయన నేటి కాళేశ్వరం సమీపంలో గోదావరినది లో తన భార్య 'విశాలాక్షి' సహా ప్రాణత్యాగం చేశారు. బందీగా దిల్లీకి చేరితే మతమార్పిడికి గురవుతానన్న మానసిక సంఘర్షణ ఆయనలో ఆనాడు ఉంది''.

ప్రతాపరుద్రుని మరణం తర్వాత మలి కాకతీయ సామ్రాజ్యం ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కేంద్రంగా కొనసాగిందన్న వాదన కొందరు చరిత్రకారుల నుంచి వినిపిస్తుంటుంది.

కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుని తమ్ముడు 'అన్నమదేవుడు' ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి ఆదివాసీల మధ్య గడుపుతూ అక్కడే తన రాజ్యాన్ని స్థాపించాడని.. అదే మలికాకతీయ సామ్రాజ్యం అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. దీనితో ఏకీభవించేవారు, దీనికి భిన్నమైనఅభిప్రాయాలు కలవారూ ఉన్నారు.

 

ప్రతాపరుద్రుని పాలన కాలం నాటికే బస్తర్ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఆ ప్రాంతానికి ప్రతాపరుద్రుని తమ్ముడు అన్నమదేవుడు పాలకుడిగా ఉన్నారు.

'కాకతీయ రాజ్యం అనే పేరుమీదుగా పరిపాలన సాగలేదు. కాబట్టి మలి కాకతీయుల పాలన అని అనలేం. కానీ అక్కడ పరిపాలించింది కాకతీయ వంశస్తులే. అది ఆ ప్రాంతంలోని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. అన్నమ దేవుని తర్వాత వచ్చిన పాలకుడైన 'దిక్పాల దేవుడు' (1680-1708) హయాంలో వేసిన 'దంతేశ్వర శాసనం'లో తాము అన్నమదేవుని వారసులమని చెప్పుకున్నారు. దండకారణ్యప్రాంత ఆదివాసీల ఐతిహ్యాల్లో కూడా 'కాకతీయుల వారసులను మా తల్లి(ఆదివాసీల దేవత) కాపాడింది' అని ఉంది''

''ఏకామ్రనాథుడి 'ప్రతాపరుద్ర చరిత్ర'లో రెండవ ప్రతాపరుద్రునికి 'వీరభద్రుడు' అనే కొడుకు ఉన్నాడని రాసి ఉంది. అయితే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. శాసనాలూ ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నాయి.

కాకతీయ సైన్యం లో 'లెంక సైన్యం' పేరుతో ఆత్మహుతి దళాన్ని పోలిన విభాగం ఉండేది. సైనిక ప్రతిజ్ఞలో భాగంగా తాము కాకతీయ పుత్రులమని, రాజు సేవ కోసమే బతుకుతామని వారు ప్రతిజ్ఞ చేసేవారు. ప్రతాపరుద్రుని కొడుకు వీరభద్రుడు అనే భావన ఇలాంటిదే కావొచ్చు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఇప్పటికీ 'లెంక' అన్న ఇంటిపేరు కనిపిస్తుంది.''

''చాళుక్యులు శాఖలుగా విడిపోయినా పశ్చిమ, తూర్పు, బాదామి,కల్యాని చాళుక్య పేర్లతో తమ వంశ నామాన్ని కొనసాగించారు. చాళుక్యులు తమ పూర్వీకులని వీరంతా చెప్పుకొన్నారు. ప్రతాపరుద్రుని తర్వాత అలా కాకతీయ వంశం పేరుతో పాలన సాగలేదు.''

''కాకతీయ సామ్రాజ్య పతనం అనంతరం తెలుగు నేలతో వారికి సంబంధాలు కొనసాగలేదు. బస్తర్ ప్రాంతంలో తమను బలపరిచిన స్థానికులతోనే సంబంధాలు కొనసాగించారు. ఒడిశా ప్రాంత రాజకుటుంబాలతో వారికి వివాహ సంబంధాలు కొనసాగాయి. తెలుగు నేలపై బహమని సుల్తానుల బలమైన రాజకీయ జోక్యం వల్ల అన్నమదేవుడు, ఆ తర్వాత ఆయన వారసులు తెలుగు ప్రాంతాలతో సంబంధాలు కొనసాగించలేకపోయారు.''

.

''ప్రతాపరుద్రుని తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. కానీ వారి వంశం ఉండవచ్చు. అన్నమదేవుడు బస్తర్ అడవుల్లోకి వెళ్లినట్టుగా కథనాలు ఉన్నాయి. శాసనాలు, సమకాలీన సాహిత్య ఆధారాలు అంత బలంగా కనపడవు. అయినా 'భంజ్‌దేవ్'లు కాకతీయుల వారసులన్న క్లెయిమ్స్ గత కొన్నేళ్లుగా వింటున్నాం. ఇన్ని తరాల తర్వాత ఈ క్లెయిమ్స్ గుర్తించడం కష్టమే. అలా అని కాదని అనలేం. విజయనగర కృష్ణదేవరాయల వారసులుగా ప్రస్తుత కుటుంబం ఆనెగుందిలో ఉంది. వారిని గుర్తించి గౌరవించుకుంటున్నాం. ఇప్పటి తరం ప్రజలు గతంలోని మహనీయులను, వారి వంశజులను గౌరవించడం ద్వారా ఆ వంశానికి మనం కృతజ్ఞత చెప్పుకొన్నట్లు అవుతుంది. అది ఇప్పటి తరం కర్తవ్యం, బాధ్యత''.

''ప్రతాపరుద్రుడిని తుగ్లక్ సైన్యం దిల్లీకి తీసుకుపోయిందని, నర్మద తీరంలో తనువు చాలించారనే వాదన ఉంది. అదే సందర్భంలో ఆయన్ను దిల్లీ పాలకుడు విడుదల చేసి తిరిగి పంపారని ఆ తర్వాత గోదావరి తీరంలో బస్తర్ ప్రాంతంలో మరణించారని.. తదనంతరం వారి కుటుంబ వారసులు బస్తర్ ప్రాంతంలో కొంతకాలం రాజ్యం చేశారని చెప్పుకుంటారు.

''మలికాకతీయులు పేరుతో సామ్రాజ్యం ఏదీ లేదు. ఆ తర్వాతి వారసులు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో చిన్న ఆదివాసీ రాజ్యాన్ని పాలించారు. బలమైన శత్రువు చేతిలో ఓడిపోయినప్పుడు, కాలం అనుకూలించనప్పుడు అటవీ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవడం అన్ని కాలాల్లో కనిపిస్తుంది. కాలం అనుకూలించాక అక్కడే సైన్యాన్ని నిర్మించుకుని తిరిగి రాజ్యాలను విస్తరించారు. అయితే కాకతీయులుగా చెప్పుకున్న బస్తర్ ప్రాంత 'భంజ్‌దేవ్'లకు ఒరిస్సా ప్రాంతానికి చెందిన రాజకుటుంబాలతో వివాహ సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారంగా కొన్ని డాక్యుమెంట్లను వార్తాపత్రికాల్లో చూశాను.

 

బస్తర్ ప్రాంత చరిత్ర, సంస్కృతిపై అధ్యయనం చేసిన రాజీవ్ రంజన్ ప్రసాద్ ''ఆమ్ చో బస్తర్'' (మా బస్తర్) పేరుతో పుస్తకం రాశారు. అందులో బస్తర్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు.

''దిల్లీ సుల్తానుల దాడిలో ఓరుగల్లు పతనమయ్యాక ప్రతాపరుద్రుడి తమ్ముడు అన్నమ దేవుడు 200 అశ్వాల సైన్యంతో గోదావరిని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించాక మొదట భూపాలపట్నం వద్ద అక్కడి నాగవంశీకులైన(చిందక్ నాగులు) ఆదివాసీలను ఓడించాడు. దీంతో క్రీ.శ. 760 నుండి 1324 వరకు ఆప్రాంతంలో సాగిన నాగవంశం పాలనకు తెరపడింది. ఆ తర్వాత కాలంలో 'కాంకేర్' ప్రాంతంలో 'పైరీ నదీ తీరం'లో చంద్రవంశీయుల రాజ్యం చేజిక్కించుకుని విస్తరించారు.

దట్టమైన అడవులతో నిండిన బస్తర్ ప్రాంతం బ్రిటిషర్ల పాలన వరకు బాహ్యప్రపంచంతో వేరుగా ఉన్న శత్రుదుర్బేద్య ప్రాంతం. దీంతో వారికి సహజసిద్ద రక్షణ లభించింది. స్థానిక ఆదివాసీలతో సత్సంబంధాలను వారు కొనసాగించారు. వారి సంస్కృతిలో కలిసిపోయారు. నాగులు(ఆదివాసీలు) మణికేశ్వరి దేవిని ఆరాధిస్తే వీరు 'దంతేశ్వరి దేవి'ని పూజించారు.

''వీరి వంశానికి సంబంధించి కొంత అస్పష్టత ఉంది. అన్నమదేవుడు తన తండ్రి తరఫున చాళుక్యుడు, తల్లి తరపున కాకతీయ వంశానికి చెందిన వారు. బస్తర్ ఆదివాసీ జానపదాల్లో వీరి గురించి 'చాళుక్య వంశ్ కీ రాజా-డిండిబీ బాజా'' అన్న కవితాపంక్తులు దీనికి ఉదాహరణ''

తర్వాతి తరంలో వచ్చిన రాజులు జగదల్ పూర్‌లో 'కాకతీయ విద్యాలయ' పేరుతో విద్యాసంస్థను నెలకొల్పారు.''

అయితే వీరి పేరులో 'భంజ్ దేవ్" అనేది ఎలా చేరిందన్న దానిపై కొంతమంది పరిశోధించారు.

తర్వాతి తరాల్లో వచ్చిన 'రాజా రుద్రప్రతాప్ దేవ్'కు మగసంతానం లేదు. ఆయన కుమార్తే 'ప్రఫుల్ల కుమారి దేవి'కి ఒడిశాలోని మయూర్ భంజ్ ప్రాంతానికి చెందిన ప్రఫుల్ల కుమార్ భంజ్‌దేవ్ తో వివాహం జరిపించాకే వారి ఇంటి పేరులో 'భంజ్‌దేవ్' చేరిందన్నది వారి వాదన.

భంజ్‌దేవ్ వంశం గురించి మాట్లాడే సందర్భంలో బస్తర్ ప్రాంత ఆదివాసీల్లో పేరుపొందిన 'రాజా ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్' గురించి మాట్లాడుకోవాలి. ఆయనే ఈ వంశ చివరి పాలకుడు. ఆదివాసీలతో కలిసి ఆయుధాలతో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో 1966లో జగదల్‌పుర్ కోట లో ఆయన్ను పోలీసులు కాల్చి చంపారు.

''ఆదివాసీల సమస్యలపై ప్రవీర్ చంద్ర్ భంజ్ దేవ్ అహింసా పద్దతిలో పోరాటాలు చేశారు. పలుమార్లు దిల్లీ కేంద్రంగా నిరాహార దీక్షల రూపంలో కూడా ఈ పోరాటాలు సాగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒకసారి ఎమ్మెల్యే గా పనిచేశారు. 'మహారాజా పార్టీ' పేరుతో ఆయన ఓ ప్రాంతీయ పార్టీని కూడా స్థాపించారు. సీట్లు గెలిచారు. కాంగ్రెస్ ను ఆ ప్రాంతంలో అడ్డుకున్నారు’’.

‘‘డి.పి.మిశ్రా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజా ప్రవీర్ చంద్రదేవ్ కు మతిస్థితిమితం తప్పిందని స్విట్జర్లాండ్ కు బలవంతంగా చికిత్స కోసం పంపారు. 1964 లో బస్తర్ దసరా వేడుకల్లో పొందే రాజా హోదా ను తొలిగించి ఆయన తమ్ముడు 'విజయ్ చంద్ర భాంజ్ దేవ్ ' ను రాజుగా ప్రకటించారు. ప్రవీర్ చంద్ర దేవ్ తో పాటు పది మందికి పైగా ఆదివాసీలు పోలీస్ కాల్పుల్లో మరణించిన రోజు రాత్రి నుండి తెల్లవారు జాము 4 గంటల ప్రాంతం వరకు రాజ్ మహల్ వద్ద కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఆయన మరణం పై ఏకసభ్య కమీషన్ ను నియమించారు''

కాగా.. రాజా ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ తమ్ముడు విజయ్ చంద్రభంజ్ దేవ్ మనవడే కాకతీయ సప్తాహ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన కమల్ చంద్ర భంజ్‌దేవ్.

 

 

విజ్ఞానాన్ని ఉచితంగా పంచె  వీరగోని ఆంజనేయులు

 

 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు మహాత్మా గాంధీ. పుస్తకం ఎంత విలువైనదో చెప్పడానికే గాంధీ జీ ఈ మాట అన్నారు. పుస్తక పఠనం ద్వారా మనిషి ఆలోచనలు, వైజ్ఞానికి పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా.. పుస్తకాలు చదవడంలో ఉన్న అనుభూతి వేరు. పుస్తకాలు ఎంత విలువైనవో తెలుపుతూ, పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన వంతు సామాజిక బాధ్యతగా ఉచిత లైబ్రరీ నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల  జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయులు అనే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ నిరుపేద విద్యార్థుల సహాయం కోసం, వారిని విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు తనవంతుగా ఉచితంగా లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు వివరించాడు. కొత్త, పాతవి కలిపి ఈ గ్రంథాలయంలో సుమారు లక్ష వరకు వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి.

వేములవాడ పట్టణానికి చెందిన వీరగోని ఆంజనేయులు.. ఇంగ్లీష్ టీచరుగా పనిచేసి 2009లో రిటైర్ అయ్యారు. పుస్తక పఠనం పై ఇష్టంతో తన 6వ తరగతి నుంచే పుస్తకాలు సేకరించేవారు. అలా 1978లోనే 'వీరగోని సరస్వతి ఆంజనేయులు, వీరగోని హనుమమ్మ బసవయ్య' పేరుతో వేములవాడ పట్టణంలో ఉచిత పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు ఆంజనేయులు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం తన పూర్తి సమయాన్ని ఈ లైబ్రరీ నిర్వహణ కోసం కేటాయించారు. ఎంతో కస్టపడి పుస్తకాలు సేకరించేవారు. చిన్నా, పెద్ద కలిపి దాదాపు లక్ష పుస్తకాలు తన లైబ్రరీలోకి తీసుకొచ్చారు ఆంజనేయులు. వాటిలో కొన్ని అరుదైన పుస్తకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులు పడే ఇబ్బందులు గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా విశ్రాంత ఉపాధ్యాయుడు అవిరాల కృషితో, అంకుటిత దీక్షతో నిరుపేద విద్యార్థుల కోసం, పాఠక ప్రియుల కోసం.. ఈ పౌర అంకితం చేసినట్లు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆంజనేయులు తెలిపారు.

 

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, నిరుద్యోగులు, పేద విద్యార్థుల కోసం ఈ గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుందని ఆంజనేయులు అన్నారు. నిరుద్యోగ యువకులు ఉన్నత పరీక్షలకు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పౌర గ్రంథాలయం సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ గ్రంథాలయం ఉచితంగా సేవలందిస్తుందని ఆంజనేయులు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు.. ఉద్యోగుల కోసం ప్రిపేర్ అయ్యే 30 మంది అభ్యర్థులకు గైడెన్స్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ గ్రంథాలయంలో అనేక రకాల కాంపిటీటివ్ పురాతన పుస్తకాలతో పాటు 250 రకాల వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయని, ప్రముఖుల జీవిత చరిత్రలు, తెలుగు, హిందీ, సాంస్కృత భాషల్లో చందమామ కథలు, మాస పత్రికలు, తాళపత్ర గ్రంథాలు సైతం ఈగ్రంథాలయంలో ఉండడం విశేషం. లైబ్రరీ ఏర్పాటులో తాను చేసిన కృషిని గుర్తిస్తూ జీవిత సాఫల్య పురస్కారం లభించిందని ఆంజనేయులు చెప్పుకొచ్చారు. రచన మహోపాధ్యాయ శ్రీహరి శర్మ, అవధాని విశ్రాంత ప్రిన్సిపాల్ వేములవాడ నడూరు రామచంద్ర రావు గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహ రెడ్డిలు తనను ఉత్తమ పుస్తక తపస్వి అనే బిరుదుతో సత్కరించినట్లు రిటైర్డ్ టీచరు ఆంజనేయులు వివరించారు.

లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలు:-

1.సర్ప ప్రాణాయం, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (56 leaves)

2. శరీరక మీమాంస భాష్యం (శంకరాచార్య)లిపి: తెలుగు సంస్కృత గ్రంథం(62 leaves)

3. ఉపనయన ప్రయోగ, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (50 leaves)

4. ఆత్మ బోధ, లిపి: తెలుగు, సంస్కృత గ్రంథం (35 leaves)

తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ నాలుగు భాషల్లో పుస్తకాలు, వార్తా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. వేదాలు, భాగవతం, భారతం భగవద్గీతతో పాటు పరమత పుస్తకాలైన బైబిల్, ఖురాన్ వంటి 18 రకాల మత పుస్తకాలు గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి.

వేములవాడలో పౌర గ్రంథాలయం:

వేములవాడలోనే ఉన్న ఈ పౌర గ్రంథాలయం ఎక్కడుందో ఎక్కువ మందికి తెలియదు. వేములవాడ పట్టణంలోని (రాజీవ్ నగర్) గంగమ్మ హోటల్ సమీపంలోనే ఈ లైబ్రరీ ఉంది. విద్యార్థులు నిరుద్యోగులు, కాంపిటీషన్ ఎగ్జామ్స్  కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ గ్రంథాలయం సేవలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవస్థాపకుడు, రిటైర్డ్ టీచర్ వీరగొని ఆంజనేయులు సూచిస్తున్నారు.

గ్రంథాలయం స్థాపకుడు వీరగోని ఆంజనేయులు (రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్), ఫోన్ నెంబర్ :9490285767

 

Wednesday, 6 July 2022

 


రాజ్యసభను చేరుకున్న 'పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌'




పిలవుల్లకండి టెక్కెపరాంబిల్ ఉష బాల్యం కేరళ రాష్ట్రంలోని కోళికోడ్, పయ్యోలి‌లో గడిచింది. అందుకే ఆమెని "పయ్యోలి ఎక్స్‌ప్రెస్" అని కూడా పిలుస్తారు..

 పిటి ఉష భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. క్రీడా రంగంలో ఆమె సాధించిన ఎన్నో ఘన విజయాలు మనందరికీ తెలుసు. అయితే, గత కొన్నేళ్ళుగా కొత్త అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ దేశానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు"

 విజేతలపైనే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఓడిపోయిన వ్యక్తులు ఎవరికీ గుర్తుండరు. ఇది సాధారణంగా ప్రముఖుల విషయంలో జరుగుతూ ఉంటుంది. కానీ, ఈ వాదన తప్పని నిరూపించారు పీటీ ఉష.

1984లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో నాల్గవ స్థానం సంపాదించినప్పటికీ, ఉష పేరు ఈ దేశపు క్రీడాకారిణుల పేర్ల మధ్య వినిపిస్తూనే ఉంటుంది. ఉష క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవడం మాత్రమే కాకుండా ఎంతో మంది క్రీడాకారుల భవితకు కూడా బాటలు వేసిన వ్యక్తి.

ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు.

 

ఉష పరుగు పెట్టడం నాల్గవ తరగతి‌లో ఉండగా మొదలుపెట్టారు. స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె జిల్లా స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు.

కానీ ఆమె అసలైన ప్రయాణం 13 ఏళ్ల వయసులో కేరళ ప్రభుత్వం ప్రారంభించిన క్రీడల విభాగంలో చేరినపుడు మొదలయింది.

"మా అంకుల్ ఒకాయన అదే స్కూల్‌ లో టీచర్‌గా పని చేస్తుండటంతో నేను క్రీడల్లో చేరడానికి మా తల్లితండ్రుల్ని ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు.

మైదానం దగ్గర చాలా కుక్కలు తిరగడంతో మా నాన్నగారు నాతో పాటు మైదానానికి వచ్చి అక్కడే ఒక కర్ర పట్టుకుని వాటిని బెదిరిస్తూ కూర్చునేవారు.’’

ఒక్కొక్కసారి ఆమె రైల్వే ట్రాక్ పక్కన ఉండే మురికి దారిలో కూడా రైలుతో సమానంగా పరుగు పెట్టే‌వారు.

ఆమెకు సముద్ర తీరంలో శిక్షణ తీసుకోవడం చాలా ఇష్టం.

"సముద్ర తీరం‌లో పరుగెత్తడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ పరుగుకు అంతే ఉండదు."

"అది 1978-79 సంవత్సరం. నేను షార్ట్స్ వేసుకుని పరుగు పెడుతుంటే అందరూ వింతగా నా వైపు చూసేవారు. చాలా మంది సముద్రపు ఒడ్డుకి వచ్చి నేను పరుగు పెడుతుంటే చూస్తూ ఉండేవారు."

నెమ్మదిగా ఆమెని ప్రోత్సహించే వాళ్ళు పెరిగారు.

"నాకు ఈత రాకపోవడం వలన నీళ్ళలోకి వెళ్లాలంటే భయంగా ఉండేది. చుట్టు పక్కల ఉండే పిల్లలు నాతో పాటు వచ్చి నేను ఈత కొడుతుంటే కాపలా కాస్తూ ఉండేవారు. "

ఆమె రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చే సంస్థలో భాగమయినప్పటికీ , వాళ్లకి ఇచ్చే సౌకర్యాలు మాత్రం నామ మాత్రంగా ఉండేవి. "అక్కడ అందరూ కలిపి 40 మంది ఉండేవాళ్ళం. మాకందరికి కలిపి రెండు బాత్రూంలు మాత్రమే ఉండేవి. కానీ మా దినచర్య కఠినంగా ఉండేది. పొద్దున్న 5 గంటలకి నిద్రలేస్తే ఆటల్లో శిక్షణతో పాటు, స్కూల్‌లో తరగతులకు కూడా హాజరు కావాల్సి వచ్చేది" అని ఉష చెప్పారు

ఆమె స్పోర్ట్స్ డివిజన్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండగా ప్రముఖ కోచ్ ఓం నంబియార్‌ని కలిసారు. ఇది ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. అయన ఉషలో దాగిన ప్రతిభని గుర్తించి ఆమె ఒక శక్తివంతమైన అథ్లెట్ గా తయారయ్యేందుకు సహకరించారు.

"మమ్మల్ని అందరినీ వలయాకారంలో నిల్చోబెట్టి నంబియార్ సర్ వ్యాయామం చేయించేవారు. బాగా వ్యాయామం చేసినవారికి తినడానికి నట్స్ ఇచ్చేవారు."

జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఆ తర్వాత జాతీయ స్థాయికి ఉష అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. కేవలం 16 ఏళ్ల వయసులో 1980లో మాస్కో‌లో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి ఒలింపిక్స్ ఫైనల్‌కి చేరిన తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె నిలిచారు.

కానీ, ఒక్క సెకండ్ తేడాతో పతకాన్ని కోల్పోయారు.

1984 లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ని తల్చుకుంటే క్రీడాభిమానులకి గగుర్పాటు తెప్పిస్తుంది.

"20 ఏళ్ల అమ్మాయి గురించి ముందెప్పుడూ వినలేదు. ఏ ప్రచారం లేకుండా ఈ రోజు బంగారు పతకం సాధించే స్థాయిలో ఉందని", పరుగు పెట్టడానికి సిద్ధంగా సన్నగా పొడవుగా లాస్ ఏంజెల్స్ ట్రాక్ మీద నిల్చున్న ఉష గురించి కామెంటేటర్స్ అనుకునేవారు.

కానీ ఆ పోటీలో ఆస్ట్రేలియా అథ్లెట్ డెబ్బీ ఫ్లింటాఫ్ ఒక్క అడుగు వేయగానే పడిపోవడంతో ఆ పోటీని రద్దు చేసి మళ్ళీ నిర్వహించారు.

"నేను చాలా వణికిపోయాను. చాలా ఆందోళనకు గురయ్యా. మళ్ళీ పరుగు మొదలయింది. కానీ, నేను వేగంగా పరుగు పెట్టలేకపోయాను."

ఈ పోటీలో ఉష రెప్పపాటులో ఓడిపోయారు.

"నా కాలు ముందుకు వేశాను. కానీ నా ఛాతి భాగం ముందుకు వంగలేదు. నేను నా ఛాతీని ముందుకు వంచి ఉంటే నేను పతకాన్ని గెలిచి ఉండేదాన్ని."

"ఆ క్షణంలో ఏడుపు వచ్చేసింది. నంబియార్ సర్ కూడా ఏడ్చేశారు. ఆ క్షణంలో భారతదేశం‌లో ప్రజలంతా నా‌లాగే బాధపడి ఉంటారు" అని ఉష అన్నారు.

నాల్గవ స్థానంలో నిలిచినప్పటికీ, ఉష‌ని భారత దేశ ప్రజలు ఒక హీరో‌లా చూశారు.

తర్వాత జరిగిన పరుగుపందేల్లో ఉష తన ప్రతిభని నిరూపించుకోలేకపోయారు. ఆమెకి విమర్శలు రావడం మొదలు పెట్టాయి. కానీ ఆమె తిరిగి విజయం సాధిస్తుందనే నమ్మకం ఆమెకి ఉంది.

1986లో సియోల్, సౌత్ కొరియా‌లో జరిగిన ఆసియన్ గేమ్స్‌లో ఉష బంగారు పతకాల పంట పండింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో ఒక పతకం, 400, 200మీటర్ల పరుగు పందేల్లో రెండు, 400 మీటర్ల రిలే రేస్‌‌లో మరొకటి.. ఇలా ఆమె నాలుగు బంగారు పతకాలు గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

"భారతదేశానికి మొత్తం ఐదు బంగారు పతకాలు వస్తే అందులో నాలుగు నావే. నాకు అది చాలా గర్వించదగ్గ క్షణం. నేను పతకం అందుకున్న ప్రతిసారీ జన గణ మనవినిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది."

1983లో ఆమెకి అర్జున అవార్డు లభించింది. 1985లో భారత ప్రభుత్వం ఆమెకి "పద్మ శ్రీ" ఇచ్చి సత్కరించింది.

పయ్యెలి గ్రామం‌లో ఆమె పేరుతో ఉన్న వీధి దాటగానే ఆమె ఇల్లు ఉంటుంది. ఆమె ఉంటున్న ఇల్లు కేవలం ఆమె నివాసం కాదు. అది ఆమె విజయాలకి, జ్ఞాపకాలకి నెలవు.

 

ఆమె విజయాల వెనక నంబియార్‌తో పాటు ఆమె భర్త పాత్ర కూడా ఉంది. 1991లో ఆమె వివాహం జరగగానే ఆమె క్రీడల నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు.

"నా భర్తకి కూడా క్రీడలంటే ఇష్టం. అతను ముందు కబడ్డీ ఆటగాడు. నేను బిడ్డకి జన్మనిచ్చాక మళ్ళీ పరుగు పెట్టడానికి నా భర్త చాలా సహకరించారు."

ఆమె 1997లో పరుగు పందేల నుంచి రిటైర్ అయ్యే సమయానికి ఆమె 103 అంతర్జాతీయ పతకాలు సాధించారు.

తర్వాత ఒలింపిక్స్ కి వెళ్లాలనుకునే అథ్లెట్‌లకి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీని ప్రారంభించారు.

"లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత ప్రతి మూడు నెలలకి శిక్షణ తీసుకోవడానికి లండన్ వెళుతూ ఉండేదానిని . అక్కడ ఉండే సదుపాయాలు చూసినపుడు అలాంటి శిక్షణ కేంద్రాన్ని ఇండియాలో కూడా ప్రారంభించాలని అనుకున్నాను" అని ఆమె చెప్పారు.

ఆమె భర్త‌తో కలిసి అథ్లెట్లు కావాలనుకునేవారికి శిక్షణ ఇస్తున్నారు.

"ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే మా లక్ష్యం. మా దగ్గర శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు ఆసియన్ గేమ్స్‌లో ఇప్పటికే ప్రతిభ కనబరిచి, ఒలింపిక్స్‌లో పదకొండవ స్థానం వరకు వెళ్లారు’’ అని ఆమె చెప్పారు.

"నేను 1980లలో.. ఏ సదుపాయాలు లేనప్పుడే ఇంత చేయగలిగానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరు. క్రీడలు కానివ్వండి, చదువులో కానివ్వండి ఏదైనా సాధ్యమే. కాకపొతే ఎదురయ్యే సవాళ్ళను మీకు మేరే ఎదుర్కోవాలి".

‘‘కష్టపడటమే మంత్రం. మహిళలు అద్భుతాలు చేయగలరు. ఇందులో సందేహం లేదు."

 

 

 

బీజేపీ టీఆర్ఎస్ సర్కార్ పై ఆర్టీఐ అస్త్రం!!!!

 

తెలంగాణలో TRS వర్సెస్ BJP వార్ ముదురుతోంది. తాజాగా టీఆర్ఎస్‌ను(TRS) టార్గెట్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా బండి సంజయ్ ప్రయోగించారు. సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆర్టీఐకి 88 దరఖాస్తులు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. వైద్య, విద్యాశాఖలకు సంబంధించి సమచారం కూడా కోరారు. బీజేపీ సమావేశాలు ముగిసిన మూడు రోజుల్లోనే టీఆర్ఎస్ సర్కార్ పై బండి సంజయ్ ఆర్టీఐకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లోనే సంజయ్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

ఆర్టీఐ నుంచి వచ్చే సమాధానం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. బండి సంజయ్ ఆర్టీఐకి ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ వ్యూహం వెనుక పెద్ద ఆలోచన ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు పదే పదే లెక్కలను ప్రస్తావిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయాన్ని ప్రస్తావించే క్రమంలో టీఆర్ఎస్ నేతలు పదే పదే లెక్కలను ప్రస్తావిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి కూడా పెద్ద ఎత్తున తీసుకెళుతోంది గులాబీ పార్టీ.

దీంతో తెలంగాణలోని అధికార పార్టీ ఏ పథకానికి ఏ మేరకు ఖర్చు చేస్తుందనే అంశాలను కూడా గణాంకాలతో వివరిస్తేనే తమకు పొలిటికల్ మైలేజీ వస్తుందనే భావనలో ఉంది బీజేపీ. అందుకే అన్ని విభాగాలు, శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తెప్పించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సమాచారం వచ్చిన తరువాత అందులో లెక్కలను బయటకు తీసి.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ కూడా సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను బీజేపీ తీసుకుంటే.. కేంద్రంలోని లెక్కలను కూడా అదే ఆర్టీఐ ద్వారా సేకరించాలని టీఆర్ఎస్ కూడా యోచిస్తోందని సమాచారం. మొత్తానికి తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ.. ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి.. బండి సంజయ్ సరికొత్త రాజకీయ వ్యూహంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...